Assam: బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా… ఎక్కడో ఓ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అధికారులు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న వయస్సులోనే పెళ్లి కావడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనర్లను పెళ్లి చేసుకున్న వారిని అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. రాబోయే ఐదారు నెలల్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకొని భర్తలైన వారిని ఎవరినీ వదిలిపెట్టేలి లేదని స్పష్టం చేశారు.
మైనర్లను వివాహం చేసుకున్న వారిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. నిందితులు యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మాతృత్వం పొందడానికి అనువైన వయస్సు 22 నుంచి 30 ఏళ్లు అని.. ప్రతీ దానికి తగిన వయసు ఉండేలా దేవుడు మన శరీరాలను రూపొందించాడని హిమంత బిశ్వశర్మ తెలిపారు.