Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ఖేరి రైతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
బెయిల్ సమయంలో ఆశిష్ యూపీ, ఢిల్లీలో ఉండరాదని, వారం రోజుల్లోగా యూపీని వదిలిపెట్టి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఎక్కడ ఉంటున్నాడనేది ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని సూచించింది. ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే వెంటనే బెయిల్ను రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరిగి బెయిల్ పిటిషన్పై మార్చి 14న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
2021లో లఖింపూర్ఖేరిలో రైతులు ధర్నా చేస్తుండగా ఆశిష్ మిశ్రా వారిపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. దీంతో ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.