BJP MP Candidate Pawan Singh : బీజేపీకి భోజ్ పురి సింగర్ పవన్ సింగ్ షాకిచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఒకరోజు కూడా గడవముందే పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కారణాలు మాత్రం వెల్లడించలేదు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ అభ్యర్థులపై సుధీర్ఘంగా కసరత్తు చేస్తోంది. లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ వచ్చిన ఒకరోజులోనే ఆ పార్టీకి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ ఎంపీ అభ్యర్థిగా భోజ్ పురి సింగర్ పవన్ సింగ్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన మాత్రం ఎన్నికల బరిలోకి దిగేందుకు విముఖత చూపించారు. తాను పోటీకి ఆసక్తిగా లేనని స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని కాషాయ పార్టీ అధిష్టానానికి తెలియజేశారు.
తనపై నమ్మకం ఉంచి ఆసన్సోల్ అభ్యర్థిగా ప్రకటించినందకు బీజేపీ అధినాయకత్వానికి పవన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే తాను అసన్ సోల్ నుంచి పోటీ చేయలేనని తేల్చేశారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్ సింగ్ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ బహుముఖ వ్యూహాలతో సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కొందరు సీనియర్లను పక్కన పెట్టింది. కొత్త నాయకులను ఛాన్స్ ఇచ్చింది. మహిళలకు అవకాశాలు కల్పించింది. బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో 28 మంది మహిళలు ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తారు.
మరోవైపు మాజీ క్రికెటర్ , ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా బీజేపీ షాకిచ్చాడు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం బీజేపీ నుంచి గంభీర్ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు. ఇలా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో సెలబ్రిటీలుగా ఉన్న నేతలు కాషాయ పార్టీకి షాకులు షాకులు ఇస్తున్నారు.