Arvind Kejriwal: ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు
Arvind Kejriwal: ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలు బలవంతం చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆప్ సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందన్న ఆరోపణల కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో రోహిణి పాఠశాలకు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు.
బీజేపీ తమపై ఎన్నో కుట్రలు పన్నుతోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తనను ఆ పార్టీలో చేరమంటున్నారన్నారు. అలా చేస్తే..ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేస్తారన్నారని పేర్కొన్నారు. కానీ, వాళ్లకు తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ తాను బీజేపీ మోచేయి నీరు తాగనన్నారు. అదే మాటను వాళ్లకు తెగేసి చెప్పానన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్లో కేవలం 4 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఏటా 40 శాతం నిధులు వైద్యం, విద్య కోసం మంజూరు చేస్తోందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ పార్టీకి తలవంచలేదనే కారణంతోనే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్రజైన్ను జైల్లో పెట్టించారని ఆయన విమర్శించారు. అన్ని దర్యాప్తు సంస్థలు ఆప్ నేతలవైపే చూస్తున్నాయన్నారు. అత్యాధునిక పాఠశాలలు నిర్మించడమే సిసోదియా చేసిన నేరమా? అని ప్రశ్నించారు.
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని జనవరి 27న మంత్రి ఆతిశీ, సీఎం కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒక్కో సభ్యుడికి రూ.25 కోట్లు ఇవ్వజూపినట్లు వారు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.