Sunita Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆమె శనివారం విడుదల చేశారు.
తన భర్తపై రాజకీయ కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ భార్య సునీత మరోసారి ఆరోపించారు. కుట్రలోనే కేజ్రీవాల్ పూర్తిగా కూరుకుపోయారని తెలిపారు. తప్పుడు వాంగ్మూలంతో మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె ఢిల్లీ ప్రజలను కోరారు. ఎంతో నిజాయితీ పరుడైన కేజ్రీవాల్కు ప్రజలు మద్దతు ఇవ్వకుంటే భవిష్యత్తులో విద్యావంతులు ఎవరూ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరని తెలిపారు.
ఢిల్లీలో భూమి కొనడానికి సీఎంను కలిశానని ఎంపీ చెప్పినప్పటికీ ఈడీ సంతృప్తి చెందలేదని అన్నారు. అతడి కుమారుడిని అరెస్ట్ చేసి ఎంపీని బెదిరించారని అన్నారు. అందుకే ఎంపీ మాట మారుస్తూ ఢిల్లీ మద్యం వ్యాపారం కోసం కేజ్రీవాల్ను కలిసానని, అందుకోసం ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు ఇవ్వాలని సీఎం అడిగారని చెప్పారన్నారు. ఎంపీ వాగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతడి కుమారుడు జైలు నుంచి విడుదల అయ్యారని సునీత తెలిపారు.
ఇదిలా ఉంటే మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్పై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ తెలిపింది. మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుతో పాటు సీబీఐ పిటిషన్ వేయడంతో కేజ్రీవాల్ జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
కేజ్రీవాల్ వైద్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎయిమ్స్ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. మెడికల్ బోర్డు ఢిల్లీ సీఎంకు ఆరోగ్య పరీక్షలు జరిపే సమయంలో ఆయనతో పాటు సునీత కేజ్రీవాల్ హాజరు కావడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శనివారం నిరాకరించింది.
CBI द्वारा CM अरविंद केजरीवाल जी की गिरफ्तारी पर सुनीता केजरीवाल जी का बड़ा खुलासा 👇 pic.twitter.com/Kin9rwTXfP
— AAP (@AamAadmiParty) July 6, 2024
ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు.
కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు అప్లోడ్ కాకముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది? హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ ఎలా విచారణ చేపట్టి ఆర్డర్ను హోల్డ్ లో ఉంచారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని.. ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని తొమ్మిది పేజీల లేఖలో వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: సంగీత్ వేడుకల్లో నీతా అంబానీ కంటతడి
బెయిల్ మంజూరు జాప్యం గురించి కూడా న్యాయవాదులు ప్రస్తావించారు. ముఖ్యంగా ఈడీ సీబీఐకి సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించడం,న్యాయసూత్రాలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధమని న్యాయవాదులు లేఖలో ప్రస్తావించారు.