Arvind Kejriwal Appeared Virtually To Court: మద్యం కుంభకోణం (Delhi excise policy case) కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు వర్చువల్గా హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు. ఇందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదంటూ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీఎంకు సమన్లు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయన నేడు కోర్టు ఎదుట వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
Read More: నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు..!
ఇటీవల కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19న విచారణకు రావాలని నోటీసులిచ్చింది. అంతకుముందు ఐదుసార్లు విచారణకు పిలవగా.. అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ గతేడాది ఏప్రిల్లో కేజ్రీవాల్ను 9 గంటలు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం దీనిపై ఓటింగ్ కూడా చేపట్టనున్నారు. తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నామని ఆరోపించారు. మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నేతల్ని అరెస్టు చేయాలని వారు భావిస్తున్నారని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ వీడిపోలేదని ప్రజలకు చూపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతునట్లు తెలిపారు.