Jalakandeswarar Temple : మన దేశంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటికీ వేల, వందల ఏళ్ల చరిత్రలు ఉంటాయి. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి జలకండేశ్వర ఆలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఉంది. క్రీస్తుశకం 1550లో విజయనగర రాజుల పాలన సమయంలో ఇక్కడ శివలింగం వెలిసిందని పూర్వీకులు చెబుతారు. ఆలయం చుట్టూ నిరంతరం నీరు ఉంటుంది కాబట్టి ఈ దేవుడిని జలకండేశ్వరుడని పిలుస్తారు. స్వయంభువు గా వెలిసిన లింగం.. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలందుకుంటోంది. కాల క్రమేణా ఈ ఆలయం పురావస్తు శాఖ అధికారుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఆలయం కేంద్రంగా ఒక వివాదం మొదలైంది.
1981లో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని జలకండేశ్వర ధర్మస్థాపన ట్రస్టు సభ్యులు భావించారు. కానీ.. పురావస్తుశాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో రహస్యంగానే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో పురావస్తుశాఖ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచీ జలకండేశ్వర ధర్మస్థాపన ట్రస్టు ఆధ్వర్యంలోనే ఆలయ నిర్వహణ జరుగుతోంది. ఈ క్రమంలో.. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరిగేలా కోర్టును అనుమతి కోరగా.. అందుకు అనుకూల తీర్పు వచ్చింది. అయినప్పటికీ జలకండేశ్వర ధర్మస్థాపన ట్రస్ట్ సభ్యులు దానిని వ్యతిరేకిస్తూ వచ్చారు.
దీంతో.. ప్రభుత్వం – ట్రస్టు మధ్య వివాదం నడుస్తోంది. ఈ ఆలయం వేలూరు ఫోర్ట్ ప్రాంగణంలో ఉంటోంది. ఆలయం లోపల కొన్ని గదులు ఉన్నాయి. కానీ వాటిలోకి భక్తులను అనుమతించరు. ఈ రహస్య గదుల్లోనే ఆలయానికి సంబంధించిన విలువైన సంపదను ఉంచుతారు. ఆ గదులను స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం పురావస్తుశాఖ అధికారుల బృందం ఆలయంలోకి వెళ్లగా.. జలకండేశ్వర ధర్మస్థాపన ట్రస్టు సభ్యులతో వాగ్వాదం జరిగింది. గదులను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారుల బృందాన్ని ట్రస్టు సభ్యులు అక్కడే నిర్బంధించారు.
సోమవారం ఉదయం వరకూ ఆలయంలోకి వెళ్లిన అధికారులబృందం తిరిగి రాకపోవడంతో.. పోలీసులే అక్కడికి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. పురావస్తుశాఖ ఇలా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ట్రస్ట్ ఆందోళన వ్యక్తం చేయగా.. అందుకు హిందూ సంఘాలు మద్దతుగా నిలిచాయి. జలకండేశ్వర ఆలయ గదుల కోసం పురావస్తుశాఖ వెళ్లడంతో.. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. గదుల్లో ఉన్న సంపద కోసమే అధికారులు వెళ్లారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం మళ్లీ కోర్టుకెళ్తుందా ? ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.