Gateway of India : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. తన ఆలోచనలను పంచుకోవడమే కాకుండా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలపై తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేస్తుంటారు. తనకు నచ్చిన విషయాలను పోస్ట్ చేస్తూ.. ఫాలోవర్లను ఇన్ స్పైర్ చేస్తుంటారు. ఈ సారి ఒక వైరల్ వీడియోపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వీడియో తననెంతో బాధకు గురిచేసినట్లు తెలిపారు.
ఆ వైరల్ వీడియోలో ఆనంద్ మహీంద్రాను బాధపెట్టేంతలా ఏముందో తెలుసా. ముంబైలో ఉన్న గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అరేబియా సముద్రంలో కొందరు వ్యక్తులు సంచుల కొద్దీ వ్యర్థాలను తీసుకొచ్చి.. అందరూ చూస్తుండగానే పడేసి వెళ్లిపోయారు. దానిని అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది. ఇప్పటివరకూ ఆ వీడియోను 2 మిలియన్ మందికి పైగా వీక్షించారు.
సముద్రంలో సంచులకొద్దీ చెత్తను పడేస్తున్న వీడియో తననెంతో బాధకు గురిచేసిందన్నారు ఆనంద్ మహీంద్రా. పర్యావరణం పట్ల పౌరుల దృక్పథం మారకపోతే.. నగరంలో జీవన నాణ్యత మెరుగుపడదంటూ.. ఆ వీడియోను X లో రీపోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావణానికి హాని చేసే వైఖరి మారినపుడు, బాధ్యతగా వ్యవహరించినపుడే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. పోలీసులు ఆ వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి ముంబై ఘనవ్యర్థాల నిర్వహణ సంస్థ రూ.10 వేలు జరిమానా విధించింది. అతనితో పాటు ఉన్న మరికొందరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.