Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. దీంతో ఈ వివాదం ఇప్పుడు ప్రపంచ వార్తగా మారింది.
అమెరికా స్పందన ఇదే..!
రాహుల్ గాంధీ ఎపిసోడ్ పై అమెరికా రియాక్ట్ అయ్యింది. ఏ ప్రజాస్వామ్యానికైనా చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలగా పేర్కొంది. భారత కోర్టుల్లో రాహుల్ గాంధీ కేసును గమనిస్తున్నామని వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛతోపాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నామని ప్రకటించింది. ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్ చేస్తూనే ఉంటామని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేయడంపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా 3 రోజుల క్రితమే స్పందించారు. ఈ నిర్ణయం గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుందని ట్వీట్ చేశారు. తన తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదని స్పష్టంచేశారు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉందంటూ ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. రో ఖన్నా తాత అమర్నాథ్ విద్యాలంకార్.. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. లాలా లజపతి రాయ్తో కలిసి పనిచేశారు. కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపారు.
కాంగ్రెస్ రియాక్షన్..
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ కేసులో తీర్పు.. ఆ వెంటనే అనర్హత పడటం అత్యంత అసాధారణం. ఈ వ్యవహారంలో కేంద్రం ప్రదర్శించిన వేగానికి ప్రపంచ పరుగుల వీరుడు ఉసెన్ బోల్ట్ కూడా ఆశ్చర్యపోతాడంటూ విమర్శించారు. నిందలకు రెండేళ్ల జైలు శిక్ష పడితే.. ఇది ఎలాంటి చట్టమో అర్థం చేసుకోవచ్చు. కావాలనే ఓ చట్టాన్ని తీసుకొచ్చి, ప్రతిపక్ష నేత గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని కేంద్రంపై చిదంబరం మండిపడ్డారు.