America : అమెరికా వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. యూఎస్ వెళ్లిన 21 మంది విద్యార్థులను ఆ దేశం వెనక్కి పంపింది. ఆ స్టూడెంట్స్ వివిధ వర్సిటీల్లోని చదివేందుకు వెళ్లారు. వారిని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు రిటర్న్ ఫ్లైట్స్ ఎక్కించారు. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్పోర్ట్ల్లో ఈ ఘటన జరిగింది.
విద్యార్థులు చూపించిన డాక్యుమెంట్స్ సక్రమంగా లేవని యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఆ కారణంగానే వెనక్కి పంపామన్నారు. అలా అమెరికా నుంచి వెనక్కి తిరిగి వచ్చిన వారిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు.
అమెరికాలోని అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్ పోర్టుల్లో దిగిన తర్వాత విద్యార్థులను తనిఖీ చేశారు. ఈ సోదాల్లో కొంతమంది స్టూడెంట్స్ పై అనుమానం వచ్చింది. దీంతో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను ప్రశ్నించారు. వారు ప్రవేశాలు పొందిన యూనివర్శిటీల్లో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితుల వివరాలను పరిశీలించారు. ఫోన్స్, మెయిల్స్, కన్సల్టెన్సీస్, యూఎస్ లోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించారు.
పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత యూఎస్ అధికారులు.. 21 మంది భారతీయ విద్యార్థులను తిప్పి పంపారు. ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయితే తిరిగి 5 ఏళ్ల వరకు వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు.