Amazon : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకూ అయోధ్యప్రసాదం పేరుతో.. భక్తులకు టోకరా వేసిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా.. తన ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందన్న కారణంగా భారీ జరిమానా పడింది. ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ సీఎన్ఐఎల్ (CNIL) భారీ జరిమానా విధించింది. 32 మిలియన్ యూరోలు అంటే.. భారత కరెన్సీలో అక్షరాలా రూ.280 కోట్లు చెలలించాల్సిందేనని ఆదేశించింది.
యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ.. అమెజాన్ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల డేటాను సేకరించినట్లు సీఎన్ఐఎల్ ఆరోపించింది. ఉద్యోగుల నుంచి వ్చిన ఫిర్యాదు ఆధారంగానే విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.
వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్ యంత్రాల ద్వారా నిఘా ఉంచినట్లు సీఎన్ఐఎల్ తెలిపింది. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పనిచేయకపోతే.. యాజమాన్యానికి అలర్ట్ మెసేజ్ వెళ్తుందని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది. కాగా.. దీనిపై అమెజాన్ తన చర్యలను సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించేందుకు ప్రొడక్ట్ డెలివరీకి ముందు సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకే ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పింది.