Alert: వర్క్ బిజీ లేదా ఇతర కారణాల వల్ల కొన్నిముఖ్యమైన పనులను చాలా మంది మర్చిపోతుంటారు. కొన్నిసార్లు వాయిదా వేస్తుంటారు. మరికొందరు ఇంకా సమయం ఉంది కదా అని లైట్ తీసుకుంటారు. తీరా గడువు ముగిశాక అయ్యో అప్పుడే చేసి ఉండాల్సిందని అనుకుంటారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మరి మీరు చేశారా?.. చేయకపోతే వెంటనే చేసేయండి..
పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. అయితే మార్చి 31తో దీనికి తుది గడువు ముగిసిపోనుంది. ఎవరైతే పాన్తో ఆధార్ను అనుసంధానం చేసుకోలేదో వారు రూ.1000 చెల్లించి ఈలోగా చేసుకోవచ్చు. లేదంటే గడువు ముగిసిన తర్వాత వాళ్ల పాన్ కార్డ్ పనిచేయదు.
2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్నుఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంది. ఇలా చేస్తేనే పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.
రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.