Air India: విమానంలో మహిళపై మూత్ర విసర్జన. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. లేటుగా స్పందించినా.. సీరియస్ గా రియాక్ట్ అయింది విమానయానసంస్థ. నిందితుడిని అరెస్ట్ చేయించడంతో పాటు.. ఘటన జరిగిన వెంటనే సరిగ్గా స్పందించని పైలట్, విమాన సిబ్బందిపై వేటు వేసింది ఎయిర్ ఇండియా.
తాగిన మైకంలో ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. ఎయిరిండియా ఫిర్యాదు మేరకు అతనిపై ఢిల్లీలో కేసు నమోదైంది.
గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్కు లేఖ రాయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుడిపై ఎయిర్ లైన్ 30 రోజుల నిషేధం విధించింది. మరోవైపు, ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నిందితుడు శంకర్ మిశ్రా పరారీలో ఉన్నాడు. ముంబయిలోని అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో.. ఢిల్లీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ స్విచాఫ్ చేసినప్పటికీ.. సోషల్మీడియాలో యాక్టివిటీ, క్రెడిట్ కార్డులు ఉపయోగించడాన్ని ట్రాక్ చేసిన పోలీసులు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, నిందితుడు శంకర్ మిశ్రా స్పందిస్తూ.. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించానని చెప్పాడు. అయితే నష్టపరిహారం చెల్లించిన నెల రోజుల తర్వాత బాధితురాలి కుమార్తె ఆ డబ్బును తిరిగి పంపించేశారు. బాధితురాలి పాడైపోయిన బ్యాగ్, దుస్తులను కూడా మిశ్రాకు పంపగా.. శంకర్ మిశ్రా వాటిని ఉతికించి నవంబరు 30నే బాధితురాలికి అందజేసినట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కేసు గురించి తెలిసి.. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో భారత విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న శంకర్ మిశ్రాను ఉద్యోగం నుంచి తొలగించారు.
ఇక, విమానంలో మహిళపై పురుష ప్రయాణికుడు మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటనతో ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ క్షమాపణలు చెప్పారు. ఘటన సమయంలో విమానంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి విధుల నుంచి పక్కనబెట్టినట్టు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
క్యాంబెల్ విల్సన్: “మా విమానాల్లో కొంతమంది తమ తోటి ప్రయాణికులు చేసిన ఆమోదయోగ్యం కాని చర్యలతో తీవ్రంగా బాధపడిన ఘటనలు ఆందోళనకరం. బాధితులు ఎదుర్కొన్న చేదు అనుభవానికి మేం విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యవహారాల్లో మేం మరింత ఉత్తమంగా స్పందించాల్సింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. నవంబరు 26న చోటుచేసుకున్న ఘటనలో నలుగురు క్యాబిన్ సిబ్బంది, ఒక పైలట్కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. దర్యాప్తు ముగిసేంత వరకు వారిని విధుల నుంచి పక్కనబెట్టాం. ఇక, విమానాల్లో ‘మద్యం సేవల’ విధానాన్ని కూడా సమీక్షిస్తున్నాం.”