Pakistan:పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకునే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి. అక్కడి ప్రజలు సైతం పాక్ సైన్యం అరాచకాలను భరించలేకపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీపై పీవోకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో అయితే.. లక్షల మంది వీధుల్లోకి వచ్చి తమను భారత్లో కలిపేసుకోండి అంటూ నినాదాలు చేస్తున్నారు. కార్గిల్ జిల్లాలోని లడక్ రోడ్ తెరిస్తే చాలు.. ఇండియాలోకి వచ్చేస్తామంటూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. నిజానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్దే. దీన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం పీవోకే కోసం తెగిస్తామంటూ కామెంట్ చేశారు. ఒక్క మాట చెబితే చాలు.. దూసుకెళ్లి, పీవోకేను స్వాధీనం చేసుకుంటామని ఆర్మీ కూడా ప్రకటించింది.
ఇప్పుడు పీవోకేలో భారత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీపై ప్రజల్లో కనిపిస్తున్న విసుగు, మరోవైపు భారత్ చేస్తున్న ప్రయత్నాలు, కామెంట్లు.. చూస్తే త్వరలోనే పీవోకేపై భారత్ ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్.. భారత్తో కొట్లాడే పొజిషన్లో లేదు. తినడానికి తిండి లేక, బయటి నుంచి కొనుక్కోలేక నానా తంటాలు పడుతోంది. అఫ్ కోర్స్.. పాక్ ఆర్థిక పరిస్థితి వేరు, సైన్యం వేరు. ఇండియాతో యుద్ధం అంటే.. పాక్ ప్రజలు నాశనమైనా ఫర్వాలేదని సమరానికి సై అంటుంది పాకిస్తాన్.
ఇంతకీ.. గిల్గిత్-బాల్టిస్తాన్లో పరిస్థితులు ఎందుకు మారాయి? లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి భారత అనుకూల నినాదాలు ఎందుకు చేస్తున్నారు? ఇందుకు సమాధానం పాక్ అరాచకాలే. గిల్గిత్ ప్రజలపై పాక్ భారీగా పన్నులు విధిస్తోంది. కరెంటు బిల్లులు చుక్కలనంటుతున్నాయి. పైగా సబ్సిడీలను సైతం ఆపేస్తున్నారు. మరోవైపు వ్యాపారాలు చేసుకోనివ్వకుండా.. స్కర్దు-కార్గిల్ రహదారిని మూసేశారు. దీన్ని తెరవాల్సిందేనంటూ అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ముఖ్యంగా పీవోకేలో చైనాతో కలిసి ఎకనమిక్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీనివల్ల గిల్గిత్ ప్రాంత వాసులకు దక్కాల్సిన ప్రయోజనాలను.. ఉర్దూ భాష మాట్లాడే ప్రాంతాలకి అనుకూలంగా ఖర్చు పెడుతున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. గిల్గిట్ బాల్టిస్తాన్లోని సహజ వనరులని తీసుకెళ్లిపోతున్నారని ఆందోళనలు చేస్తున్నారు. ఫలితంగానే.. తమను భారత్లో కలిపేసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇక్కడ బలవరిస్తాన్ నేషనల్ ఫ్రంట్ ప్రాబల్యం ఎక్కువ. ఒకప్పుడు ఈ పార్టీ నేతలు తమను పాకిస్తాన్లో కలపాలంటూ పోరాటం చేశారు. కాని, పదేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమ ప్రాంత వనరులని దోచుకుంటున్న పాకిస్తాన్.. తమకే అన్యాయం చేస్తోందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తించారు. చివరికి గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రాంత వాసుల కనీస హక్కులను కూడా అణచివేస్తోంది. గత ఐదేళ్లలో పరిస్థితులు మరింత దిగజారాయి. గోధుమ పిండి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి. పాకిస్తాన్లో కేజీ గోధుమ పిండిని 150కి ఇస్తున్న అక్కడి సర్కార్.. గిల్గిత్ ప్రాంతంలో మాత్రం 200లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. పైగా వందల ఏళ్లుగా ఉంటున్న తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ సైన్యం ఆక్రమిస్తోందని, తమను వేరే ప్రాంతాలకి తరలించాలని ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ కారణాలతోనే గిల్గిట్- బాల్టిస్తాన్ ప్రజలు భారత దేశంలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు.