Aero India: బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ఏరో ఇండియా 2023 షోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాల విన్యాసాలను మోదీ వీక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. ఈ ఎయిర్షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ పాల్గొన్నారు. స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ‘గురుకుల్’ విన్యాసానికి నాయకత్వం వహించారు. ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్ వేగా నిలుస్తుందని
ప్రధాని మోదీ అన్నారు.
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఇది. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శన 5 రోజులపాటు జరుగుతుంది. 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు విన్యాసాలు ప్రదర్శిస్తారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఎయిర్బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయీస్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
ఈ ఎయిర్షోలో భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య 251 ఒప్పందాలు కుదురుతాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఒప్పందాల విలువ రూ.75 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.