Tunisha Suicide : బాలీవుడ్ యువనటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్ను అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం వరకు వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవలే విడిపోయారని సమాచారం.
శనివారం ‘అలీబాబా దాస్తాన్ ఈ కాబుల్’ షూటింగ్ సెట్లో షీజన్ మేకప్ రూమ్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తునిషా తల్లి షీజన్పై ఆరోపణలు చేశారు. ఆత్మహత్య చోటు చేసుకొన్న సమయంలో సెట్లో ఉన్న సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసును హత్య లేక ఆత్మహత్య అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చంద్రకాంత్ జాదవ్ ప్రకటించారు. ఘటనా స్థలంలో తమకు ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని వెల్లడించారు. షీజన్ను సోమవారం వసాయి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన తునిషా పలు చిత్రాల్లో నటించారు. ‘భారత్ కా వీర్ పుత్ర’ అనే సీరియల్తో 13 ఏళ్లకే నటిగా మారిన తునిషా ‘చక్రవర్తి అశోక సామ్రాట్’, ‘గబ్బర్ పూన్చావాలా’, ‘ఇంటర్నెట్ వాలాలవ్’, ‘హీరో: గాయబ్ మోడ్ ఆన్’ ధారావాహికల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. వెండితెరపైనా సందడి చేసింది. కత్రినా కైఫ్, విద్యాబాలన్ లాంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ‘ఫితూర్’ సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించింది. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు దూసుకెళ్లుతున్న ఆమె ఇలా అనుమానస్పదంగా మృతిచెందడం బాలీవుడ్ లో పెనువిషాదాన్ని నింపింది.
జనవరి 4న 21వ పుట్టిన రోజు వేడుక చేసుకోవాల్సిన తునిషా విగత జీవిగా మారడాన్ని బాలీవుడ్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తునిషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఆఖరి పోస్ట్ను షేర్ చేస్తూ పలువురు సంతాపం ప్రకటించారు. తన ఫొటోను షేర్ చేస్తూ ‘‘అభిరుచితో పని చేసేవారు ఎప్పటికీ ఆగరు’’ అని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే తునిషా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.