Actor Mithun Chakraborty: ఏ నటుడికైనా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందంటే చాలు.. ఆ నటుడి ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఈ అవార్డుకు ఎంపిక కావడం అనేది అంత ఆషామాషీ కాదు. అయితే తాజాగా ఈ అవార్డుకు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది. ఈయనకు ఏడాది కాలం క్రితమే కేంద్రం పద్మభూషణ్ అవార్డును సైతం అందించింది. ఇక్కడే ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఏడాదిలో ఒకే నటుడికి అరుదైన 2 అవార్డులు ప్రకటించడం అంత ఈజీ కాదు. అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందా అన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది.
బాలీవుడ్ సినీ ప్రపంచంలో మిథున్ చక్రవర్తి హీరోగా, విలన్ గా, అలాగే టాలీవుడ్ లో సైతం ఎన్నో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందారు. నటుడు, నిర్మాతగా విశేష సేవలు అందించిన మిథున్ చక్రవర్తి, బాలీవుడ్లో ఒకే ఏడాది 19 చిత్రాల్లో నటించి అరుదైన ఘనత సాధించారు. అయితే ఈయన రాజకీయ రంగంలో సైతం అడుగుపెట్టారు. బెంగాల్ ఎన్నికల ముందు టీఎంసీ పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. ఓ వైపు సినీ రంగంలో రాణిస్తూ.. మరోవైపు రాజకీయంగా సైతం తనదైన శైలిలో రాణించేందుకు ప్రయత్నించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
ఇక బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తికి ఈ ఏడాది జనవరిలో కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సైతం ఎంపిక చేసినట్లు తెలిపింది. దీనితో మిథున్ చక్రవర్తికి సినీ రంగం ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంతవరకు ఓకే.. మిథున్ చక్రవర్తి మంచి నటుడు, ఎన్నో విలక్షణ పాత్రలలో మెప్పించారు. కానీ ఒకే ఏడాది రెండు అవార్డులకు ఎంపిక కావడం వెనుక రాజకీయ కోణం ఉందా అనేది బాలీవుడ్ లో చర్చ సాగుతోంది.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకే మిథున్ చక్రవర్తికి వరుస అవార్డుల పంట పండిందని సోషల్ మీడియాలో ఓ వర్గం వైపు నుండి వాదన వినిపిస్తోంది. ప్రతీ విషయంలో రాజకీయ కోణం చూడరాదు.. మిథున్ చక్రవర్తి చాలా కష్టపడి బాలీవుడ్ లో రాణించారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యే అన్నీ అర్హతలు ఉన్నాయని మరో వర్గం వాదన. ఏదిఏమైనా మిథున్ చక్రవర్తి కి అరుదైన అవార్డు రాగా.. ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, మిథున్ చక్రవర్తి అరుదైన అవార్డుకు ఎంపిక కావడం పట్ల టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయంమని, తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నట్లు లెజెండ్ స్పందించారు.