Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. షిర్డీ యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
ఠాణె జిల్లా నుంచి యాత్రికులతో ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు షిర్డీకి బయల్దేరింది. శుక్రవారం ఉదయం నాసిక్-షిర్డీ హైవేపై ఈ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నాసిక్ – షిర్డీ హైవేపై జరిగిన బస్సు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేతీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.