Rajya Sabha: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణలో కే కేశవరావు తన రాజ్యసభ స్థానానికి ఈమధ్యే రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం రాజ్యసభలోని 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ సిద్ధమైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ఈ ఖాళీలను పూర్తి చేయడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
తెలంగాణలో పార్టీ మారిన కేకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయగా, మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పలువురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో పలు రాష్ట్రాల్లోని స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈక్రమంలోనే తెలంగాణ స్థానానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని బుధవారం అధికారికంగా ప్రకటించింది.