Satyendar Jain : ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అతనే సత్యేందర్ జైన్. ఓ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అక్కడ కూడా ఆయన చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. ఆప్ మంత్రి జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా మొన్న జైలులో మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయట వచ్చింది. తాజాగా ఫుడ్ వీడియో వైరల్ గా మారింది.
మత విశ్వాసాలకు అనుగుణంగా తనకు తగిన ఆహారం అందించడం లేదంటూ జైన్ కోర్టును ఆశ్రయించారు. తాను అరెస్టయిన దగ్గరి నుంచి జైలు అధికారులు ఆహారం, ఔషధాలు సరిగా అందించటంలేదని మంత్రి పిటిషన్లో పేర్కొన్నారు. జైలులో సత్యేందర్ కు ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఆయన తరపున లాయర్ కోర్టులో వాదించారు. అందువల్ల 28 కిలోల బరువు తగ్గారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సత్యేందర్ జైన్ భోజనం చేస్తున్న వీడియోను తీహార్ జైలు అధికారులు విడుదల చేశారు. సత్యేందర్ జైలుకు వచ్చిన తర్వాత 8 కిలోలకుపైగా బరువు పెరిగినట్లు వెల్లడించారు. సత్యేందర్ కడుపునిండా భోజనం చేస్తున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సత్యేందర్ మధ్యాహ్నం లంచ్ తోపాటు, ఈవెనింగ్ స్నాక్స్ తీసుకుంటూ కనిపించారు.
మంత్రి సత్యేందర్ జైన్ జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఇటీవల ఈడీ ఆరోపించింది. జైలులో ఆయన మసాజ్ చేయించుకుంటున్నారని ఆరోపించింది. బిస్లరీ నీరు తాగుతున్నారని పేర్కొంది. ఆ ఆరోపణలను రుజువు చేస్తూ మసాజ్ వీడియో ఇటీవల రిలీజ్ అయ్యింది. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రికార్డు చేసిన రెండు వీడియో క్లిప్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆప్ను ఇరకాటంలో పెట్టేలా మరో వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.