AAP Leader Manish Sisodia padayatra(Telugu news live today): 17 నెలల విరామం తర్వాత మళ్లీ పబ్లిక్ ను చేరుకున్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. తాను జైలు నుంచి బయటకు రావాలని కోరుకున్న ప్రతి ఒక్క అభిమానికి ఈ జన్మమంతా రుణపడి ఉంటానని అన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ కోసం బయటకు రావాలని ప్రార్థించండి. మళ్లీ ఆప్ కు మంచి రోజులు రానున్నాయని అన్నారు. ఇక ఎక్స్ వేదికగా తాను చేపట్టబోయే పాదయాత్ర వివరాలను తెలియజేశారు. ఇన్నాళ్ల విరామం తర్వాత కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అప్పటి ఆదరణే ఇప్పుడు కూడా చూపిస్తున్నారని ..మళ్లీ ఈ వాతావరణం చూస్తుంటే తప్పకుండా రాబోయే ఎన్నికలలో ఆప్ అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం పెరిగిందని అన్నారు. పాదయాత్ర సందర్భంగా తనకు మహిళలు ప్రేమాభిమానంతో రాఖీలు కట్టడంతో తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని మనీశ్ సిసోడియా తెలిపారు.
ఢిల్లీలో మళ్లీ రాబోయేది ఆప్
త్వరలో ఢిల్లీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్ర ఉండబోతోందని మనీశ్ తెలిపారు. త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారని అన్నారు. కక్షపూరిత అరెస్టుల ద్వారా సాధించేది ఏమీ ఉండదని అన్నారు. ప్రజలలో ఇప్పటికీ ఆప్ అంటే అభిమానం చెక్కుచెదరలేదని..మళ్లీ ఢిల్లీలో రాబోయేది తమ ప్రభుత్వమే అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మనీశ్ సిసోడియా. జైలు నుంచి బయటకొచ్చిన మనీశ్ గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడి ప్రజలను కలుసుకున్నారు. దారిపొడవునా మనీశ్ కు ప్రజలు నీరాజనాలు పలికారు. అఖండ రీతిలో స్వాగత సన్నాహాలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి బొట్టుపెట్టి మనీష్ సిపోడియా చేతికి రాఖీలు కట్టారు.