CWC : 2024 ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక చర్యలు చేపడుతోంది. పార్టీ ప్రక్షాళన చేపట్టింది. మొత్తం 84 మందితో కొత్త వర్కింగ్ కమిటీని ప్రకటించింది.
ఇందులో 39 మంది సభ్యులుగా ఉంటారు. 18 మందిని CWC శాశ్వత ఆహ్వానితులుగా ఎంపిక చేశారు. 14 మంది ఇన్ ఛార్జ్ లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. నలుగురు ఎక్స్అఫిషియో సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో ఖర్గేతోపాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, ఏకే అంటోని లాంటి అగ్రనేతలకు చోటు దక్కింది.
CWCలో సభ్యుడిగా ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఎవరికీ CWC సభ్యుడిగా అవకాశం ఇవ్వలేదు. అయితే ఏపీ నుంచి మాజీ కేంద్రమంత్రి పళ్లంరాజు, తెలంగాణ నుంచి యువనేత వంశీచందర్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది.
కొంతమందికి శాశ్వత ఆహ్వానితులుగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బిరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహ శాశ్వత ఆహ్వానితులుగా ఛాన్స్ దక్కించుకున్నారు. cwc లో తెలంగాణ నుంచి ఎవరికీ సభ్యుడిగా అవకాశం ఇవ్వకపోవడంపై చర్చ నడుస్తోంది.
గతేడాది ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో CWC స్థానంలో 47మందితో తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా మళ్లీ CWC ను పునర్వ్యవస్థీకరించారు.