Karnataka : పద్నాలుగేళ్ల బాలికు మగ బిడ్డ జన్మించాడు. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం ఓ ఆస్పత్రిలో ప్రసవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9 వ తరగతి విద్యార్థిని హాస్టల్ నుంచి తన ఇంటికి వెళ్లింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడింది.
దాంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి ఆమె గర్భంతో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఏం జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. అప్పటికే ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న బాలికకు వైద్య పరీక్షలు చేసి అనంతరం వైద్యులు ప్రసవం చేశారు. బాలిక బరువు తక్కువగా ఉన్నప్పటికీ.. శిశువు, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు.. వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. పాఠశాలలో సీనియర్ విద్యార్థే ఆమె గర్భం దాల్చడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడిని విచారణ చేయగా.. అతడు తనకేమీ సంబంధం లేదని తెలిపాడు. కాగా.. బాలుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు.
బాలిక, ఆమె తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకపోవటంతో వాళ్లకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతోంది. అందువల్ల అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని సీనియర్ పోలీసు వివరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించారు. బాలిక చదువుతున్న హాస్టల్ వార్డెన్ను అధికారులు సస్పెండ్ చేశారు.