DMK MLA’s Son : ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు, కోడలుపై కేసు నమోదైంది. పరారీలో ఉన్న వారిద్దరిని అరెస్టు చేసేందుకు మూడు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
తమిళనాడులోని పల్లావరం ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివాణన్, కోడలు మెర్లినా తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఫిర్యాదు రావడంతో నీలాంగరై ఆల్ ఉమెన్ పోలీసులు వారిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం.
6 రోజుల క్రితం వారిపై కేసులు నమోదైంది. అప్పటినుంచి మదివాణన్, మెర్లినా ఆచూకీ లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు ప్రత్యేక పోలీసు బృందలను ఏర్పాటు చేశారు. ఇద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మదివాణన్, మెర్లినా.. బాధిత యువతిని ఎలా హింసించేవారో పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు. దాని ప్రకారం.. ఇటీవల వారితోపాటున పని మనిషిని ముంబయి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా వంట చేయలేదని దాడిచేశారు. పచ్చి మిరపకాయ తినిపించి హింసించారు. వాతలు పెట్టారు. రక్తం వచ్చేలా కొట్టేవారని మదివాణన్, మెర్లినాపై కేసు నమోదైంది. మూడేళ్లు తమ వద్దే పనిచేయాలని సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని అభియోగాలు నమోదయ్యాయి. కులం పేరుతో తిడుతూ తరచూ దాడి చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.