America : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. దుండగుల దుశ్చర్యకు అమాయకులు బలి కావడం కామన్ గా మారింది. తాజాగా ఓ మాల్లో దుండగుడు విచక్షణారహింతంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగర శివారు అలెన్లోని ప్రీమియర్ మాల్లో కాల్పుల ఘటన జరిగింది. ఈ సమయంలో షాపింగ్ కోసం వచ్చిన వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి మాల్ బయట కారులోంచి దిగాడు. కాల్పులు జరుపుతూ మాల్ లోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పుల ఘటనపై స్థానికులు అలెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగుడిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. గాయపడిన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తుపాకీ సంస్కృతికి అమెరికాలో అమాయకులు బలైపోతున్నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, స్కూళ్లు ఇలా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. కాల్పుల ఘటనలు అమెరికాలో సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సగటున వారానికో ఒక ఘటన జరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా కాల్పుల ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టెక్సాస్ గవర్నర్తో మాట్లాడారు.