7th Phase Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. నేడు ఏడో విడత పోలింగ్తో ఎన్నికలకు తెరపడనుంది. ఈ మేరకు ఏడో విడత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
10.06 కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు ఉండగా.. 4.82కోట్ల మంది మహిళా ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ఏడో విడతలో పలు స్థానాల నుంచి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్నారు. వారణాసి నుంచి ప్రధాని మోడీ, మండి స్థానం నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేసే స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
ఇప్పటి వరకూ 6 దశల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నేటి సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడనున్నాయి.