భారత్ – మయన్మార్ సరిహద్దులో.. దక్షిణ మణిపుర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన సైనికుడొకరు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.
గతేడాది మణిపుర్ లో రెండు జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా.. ఎంతటి ఆందోళనలకు దారితీశాయో తెలిసిందే. మణిపుర్ అల్లర్లతో యావత్ దేశం అట్టుడికింది. తాజాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైన చురాచాంద్ పుర్ కావడం గమనార్హం. అతను కుకీ వర్గానికి చెందినవాడిగా గుర్తించారు.
కాల్పులకు గురైన బాధితులు మైతేయ్ వర్గానికి కానీ.. మణిపుర్ కు చెందినవారు కానీ కాదని సమాచారం. ఈ కాల్పులపై ఎలాంటి వదంతులు లేకుండా ఉండేందుకు అస్సాం రైఫిల్స్ ఈ ఘటన వివరాలను వెల్లడించింది.