Dehradun : డెహ్రాడూన్ లో విషాదకరమైన ఘటన జరిగింది. ఆ పసివాడు పుట్టిన వారం రోజులు కూడా గడవక ముందే తల్లిదండ్రులు మృతిచెందారు. వారి మృతదేహాల పక్కనే ఆ చిన్నారి ఉన్నాడు. 3 రోజులు వరకు ఆ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు. ఆ ఇంటి నుంచి దర్వాసన వస్తోందని ఈ నెల 13న ఇరుపొరుగు వారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి తలుపులు తెరిచేసరికి 25 ఏళ్ల ఓ వ్యక్తి, 22 ఏళ్ల అతని భార్య ఫ్లోర్ పైనే విగత జీవులుగా పడిఉన్నారు. వారి మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు.
అప్పటికి 3 రోజుల క్రితం భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. ఆ చిన్నారిని ప్రభుత్వం డూన్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. పసివాడు డీహైడ్రేషన్ కు గురైయ్యాడని వైద్యులు తెలిపారు. కానీ ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు .
ఆ చిన్నారి డీహైడ్రేషన్ స్థితిలో ఉండగా తీసుకొచ్చారని GDMCH చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యూసఫ్ రిజ్వీ తెలిపారు. వెంటనే బాబుకు ఫ్లూయిడ్స్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారి ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ICUలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. ఆ పసివాడికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. భౌతికంగా ఎలాంటి సమస్యలేవని స్పష్టం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ లోని సహరన్ పూర్ చెందిన కషిఫ్ గా గుర్తించారు. అతని భార్య ఆనం జూన్ 8న బాబుకు జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ భార్యాభర్తలు టర్నర్ రోడ్డులోని ఇంటికి 4 నెలల క్రితమే అద్దెకు దిగారని వివరించారు. కషిఫ్ క్రేన్ ఆపరేటర్ గా పనిచేసేవాడని.. ఆనంతో ఏడాది క్రితమే వివాహమైందన్నారు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.