Amrit Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి స్పందన చూసాక కేంద్రం మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా 50 రైళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అమృత్ భారత్ రైళ్లు భారీ విజయం సాధించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇప్పటివరకు రెండు అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఒక రైలు వెస్ట్ బెంగాల్లోని మాల్టా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య నడుస్తోంది. ఈ రైలు ఆంధ్ర ప్రదేశ్ గుండా ప్రయాణిస్తోంది. ఇంకొక అమృత్ భారత్ రైలు బిహార్లోని దర్భాంగా నుంచి ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు విశేష స్పందన లభించడంతో కేంద్ర ప్రభుత్వం మరో 50 రైళ్లను ప్రవేశపెట్టనుంది.
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇవి పూర్తిగా ఎల్ఎహ్బీ బోగీలు. ఇందులో 12 స్లీపర్ కోచ్లు, 8 జనరల్ కోచ్లతో పాటు 2 లగేజీ కోచ్లు ఉంటాయి. పూర్తిగా అధునాతన సాంకేతికతతో తక్కువ సమయంలోనే ఎక్కువ స్పీడ్ను అందుకునేలా వీటిని డిజైన్ చేశారు. ఈ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 1800 మంది ప్రయాణించేలా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను డిజైన్ చేశారు. ఈ రైళ్లు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను కలుపుతాయి.