India Covid Cases: భారత్లో మళ్లీ కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి రావడంతో.. ప్రజల్లో గుబులు మొదలైంది. ఇదిలా ఉండగా ఈ కరోనాతో కొత్తగా ఐదుగురు చనిపోవడంతో.. తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు ఉండగా.. యూపీలో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.
ఇదే సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం చీఫ్ డాక్టర్ మరియా వాన్ ఖర్కోవ్ కీలక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కేసులకు గల కారణాలను ఆమె వివరించారు.
ప్రస్తుతం కోవిడ్ తో పాటు ఇన్ ఫ్లుయెంజా, బ్యాక్టీరియా, ఇతర వైరస్ లు వ్యాప్తిలో ఉన్నాయని, హాలిడే సీజన్ కావడంతో పెద్దఎత్తున వేడుకల్లో పాల్గొంటుండటం వల్లే కేసులు పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. కోవిడ్ వైరస్ మారుతుండటం వల్ల కూడా కేసులు పెరుగుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 68 శాతం కేసులకు కోవిడ్ XB వేరియంట్ కుటుంబానికి చెందిన వైరస్ లు, జేఎన్ 1 వంటి సబ్ వేరియంట్లే కారణమని వివరించారు. భారత్ లో కోవిడ్ సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 బయటపడింది. మరోవైపు సింగపూర్ లో కేసులు పెరుగుతుండటంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరి చేశారు.