Uttarakhand Madrasa Demolition Haldwani Violence: ఉత్తరాఖండ్లోని హల్దానీలో మదర్సా కూల్చివేతతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దారుణ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 250 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మదర్సాను కూల్చివేసేందుకు అధికారులు, పోలీసులు యత్నించినప్పుడు.. మూక దాడి జరిగింది. దీంతో అక్కడ భారీగా హింస చెలరేగింది.
ఈ ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు, మున్సిపల్ అధికారులు సహా సిబ్బంది గాయపడ్డారు. జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయని సమాచారం. రాళ్లు విసిరిన వారిపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాహనాలకు నిప్పంటించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెంటనే స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే కూల్చివేతకు అధికారులు వెళ్లారని స్పష్టంచేశారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రమే పోలీసులతో ఘర్షణపడ్డారని.. హింసకు అదే కారణమని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, కేంద్ర బలగాలను మోహరిస్తున్నారని.. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలను కోరారు.
మదర్సా, నమాజ్ సైట్లను ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని మునిసిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. గతంలో మదర్సా సమీపంలో ఉన్న మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఉన్నత అధికారులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష నిర్వహించారు. హింసను నియంత్రించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ కర్ఫ్యూ ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ విధించడంతో నగరంలోని దుకాణాలు, పాఠశాలలు మూసివేశారు. మదర్సా పరిసర ప్రంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.
మరోవైపు గాయపడినవారికి సోబన్ సింగ్ జీనా హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. చాలా మందికి తల, ముఖానికే గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. మదర్సా కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉత్తరాఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. కానీ, కోర్టు స్టే విధించడానికి నిరాకరించడంతో కూల్చివేత కొనసాగింది. ఈ కేసుపై ఫిబ్రవరి 14న మరోసారి హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు.