Drugs: హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ మూవీ చూశారా? స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. అందులో ఓ సీన్ సినిమాకే హైలైట్. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకోకుండా.. పక్కాగా ప్లాన్ చేస్తారు. డ్రగ్స్ను చిన్న చిన్న క్యాప్సిల్స్గా మార్చి.. మింగేస్తారు. అయినా, స్కానింగ్లో దొరికిపోతారు. ఆ సీన్ అప్పట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీడొక్కడే సినిమా చూసిన వాళ్లందరికీ కడుపులో డ్రగ్స్ దాస్తారనే విషయంపై క్లారిటీ ఉంటుంది. కానీ, ఓ ఇద్దరు నైజీరియన్లు అవుట్ డేటెడ్ స్మగ్లింగ్ స్ట్రాటజీ అప్లై చేసి అడ్డంగా దొరికిపోయారు.
పాపం.. వాళ్లిద్దరూ వీడొక్కడే సినిమా చూడలేదు కాబోలు. ఈ ఐడియా తమకే వచ్చిందని, కొత్తగా ఉందని అనుకున్నట్టున్నారు. కొకైన్ను క్యాప్సిల్స్గా మార్చి.. మింగేసి.. కడుపులో దాచేసి.. ఎంచక్కా విమానం ఎక్కేశారు. తాము ఎవరికీ దొరకమని, తమను ఎవరూ పట్టుకోలేరని భ్రమ పడ్డారు. కానీ, మన ముంబై డీఆర్ఐ టీమ్ వీడొక్కడే మూవీ చూసినట్టుంది. ఆ ఇద్దరు నైజీరియన్ల ప్రవర్తనపై అనుమానం వచ్చి.. స్కాన్ చేస్తే.. వారి కడుపులో దాదాపు 30 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికింది.
డ్రగ్స్ దందాపై డీఆర్ఐకి ముందస్తు సమాచారం అందింది. డ్రగ్స్తో ఇద్దరు ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో దిగబోతున్నారని మెసేజ్ వచ్చింది. లాగోస్ నుండి అడిస్ అబాబా మీదుగా ముంబైకి వచ్చిన ఇద్దరు నైజీరియన్ ప్యాసింజర్లను విచారణ కోసం ఆపేశారు. వారి బ్యాగ్లు తనిఖీ చేయగా ఎలాంటి డ్రగ్స్ లేవు. కానీ ప్రవర్తనలో తేడా కనిపించే సరికి వారిని.. మరింత స్కానర్లతో పరిశీలించగా వారిద్దరి కడుపులో డ్రగ్స్ ఉన్నట్టు డీఆర్ఐ వర్గాలు గుర్తించాయి.
ఆ నైజీరియన్ స్మగ్లర్లను హాస్పిటల్కి తీసుకెళ్లి.. కడుపులో దాచిన డ్రగ్స్ క్యాప్సిల్స్ అన్నీ బయటకు తీయించారు. అవన్నీ కొకైన్ క్యాప్సిల్స్ అని.. వాటి బరువు 2.976 కిలోల ఉన్నట్టు తేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ డ్రగ్స్ ధర సుమారు 30 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది DRI.