Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు గట్టి షాక్ తగిలింది. ఇస్లామాబాద్లోని జిల్లా సెషన్స్ కోర్టు తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేల్చింది. ఇమ్రాన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే రూ. లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే ఇమ్రాన్ మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించింది.
ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే అరెస్టు వారెంట్ కూడా జారీ అయ్యింది. లాహోర్లో తన నివాసంలో ఉన్న ఇమ్రాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరు. ఈ నెల 9న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని ఇప్పటికే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు ఇమ్రాన్పై అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రధాని షెహబాజ్ వెల్లడించారు.
గతేడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం పరీక్షతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఆయనకు కేసుల ఉచ్చు బిగిసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిలో ఉన్న సమయంలో విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ప్రధాని హోదాలో ఇమ్రాన్ విదేశీ పర్యటనల్లో 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. పాకిస్థాన్ రాజకీయ సంప్రదాయాల ప్రకారం ఆ కానుకలను తోషాఖానాలో జమ చేయాలి.
ఆ బహుమతులను సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. ఇమ్రాన్ మాత్రం రూ.38 లక్షల రొలెక్స్ గడియారాన్ని కేవలం రూ.7 లక్షల 54 వేలకే తీసుకున్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్ గడియారానికి రూ.2 లక్షల 94వేలు మాత్రమే చెల్లించారు. నగలు, ఖరీదైన ఐటమ్స్ ను చాలా తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లారు. ఇలా రూ. 11.9 కోట్ల విలువైన వస్తువులను ఆయన కేవలం రూ. 2.4 కోట్లకే తీసుకున్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. ఇమ్రాన్ కొన్ని వస్తువులను దుబాయ్లో అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయనకు ఇప్పుడు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది.