మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వరుసగా చిరుతల మృతిపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ గుడ్ న్యూస్ వినిపించింది. మొన్ననే ఆషా అనే చిరుత మూడు కూనలకు జన్మనివ్వగా.. తాజాగా జ్వాలా అనే మరో నమీబియా చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వారం రోజుల్లోనే చిరుత పిల్లల సంఖ్య 6కు చేరుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు జన్మించిన చిరుత పిల్లల సంఖ్య 21కి చేరుకోవడం విశేషం.
భారత్ లో చీతాల జనాభా అంతరించిపోయిందన్న కారణంతో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి కొన్ని చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు. కానీ అవి అనూహ్యరీతిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులను కలవరపెట్టింది. కానీ తాజాగా చిరుత పిల్లలు జన్మించడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతానికి కునో నేషనల్ పార్క్ లో 13 పెద్ద చీతాలు, 21 కూనలు ఉన్నాయి. వాటి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.