Hottest Year : కాలచక్రంలో మరో ఏడాది కరిగిపోతున్న తరుణంలో ఇదో చేదువార్త. అత్యధిక వేడిమి నమోదైన సంవత్సరంగా 2023 మిగిలిపోనుంది. ఈ ఏడాది ప్రపంచం యావత్తు భగభగలాడింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు దాదాపు 1.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్(WMO) హెచ్చరించింది.
భూతాపం పెరుగుదలతో దుబాయ్లో గురువారం ఆరంభమైన పర్యావరణ సదస్సు కాప్-28కు హాజరైన నేతలపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలంటూ పేద దేశాలు మరోమారు తమ వాణిని గట్టిగా వినిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్రీన్హౌస్ వాయువులు, ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాల పెరుగుదలతో పాటు అంటార్కిటిక్ మంచు కరిగిపోతుండటం వంటివి ఇప్పటికీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని డబ్ల్యూఎంవో పేర్కొంది. 1.5 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రతలను(గ్లోబల్ వార్మింగ్) పెరగనివ్వరాదన్నది 2015 పారిస్ ఒప్పందం లక్ష్యం.
ఇప్పటికే దానికి దరిదాపుల్లోకి వచ్చేసినందున.. ఇకనైనా ఉష్ణోగ్రతలు పెరగకుండా కళ్లెం వేయాల్సి ఉంది. గత రెండేళ్లలోనే స్విట్జర్లాండ్లో పదిశాతం మేర మంచు కరిగిపోయింది. కెనడాలో కార్చిచ్చు ఫలితంగా అక్కడి అటవీ విస్తీర్ణంలో 5 శాతం మేర బూడిదగా మారిపోయింది. ఈ రెండు పరిణామాలు కొత్తవి, తీవ్ర ఆందోళన కలిగించేవే.
శిలాజ ఇంధనాలను మండించడం వల్లే వాతావరణంలో ఈ విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. అంతిమంగా ఇవి తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనడానికి దారితీశాయి. ఈ శీతాకాలంలోనూ ఇది ఇలాగే కొనసాగితే 2024 సంవత్సరం మరింత వేడిమిని చవిచూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.