20 Coach Vande Bharat Trains: ఇండియన్ రైల్వేస్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, అత్యంత వేగంగా వెళ్లే ఈ రైళ్లకు అత్యంత తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించింది.
వందే భారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ప్యాసెంజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు 20 కోచ్ల వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకురానున్నట్లు తెలిపింది.
వందే భారత్ ట్రైన్లలో టికెట్ల కొరత
ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి రెండు రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి 8 కోచ్ ల రైలు కాగా, మరొకటి 16 కోచ్ ల రైలు. ఈ రైళ్ల స్పీడ్, అత్యాధునిక సౌకర్యాల కారణంగా ప్రయాణీకులు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ రైళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టికెట్లు దొరకడం లేదు. వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్న ప్రతి చోటా టికెట్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో 20 కోచ్ల వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
16 కోచ్ల వందే భారత్ రైల్లో రెండు ఎగ్జిక్యూటివ్ AC చైర్ కార్ కోచ్లు, 16 AC చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. మొత్తం 1,204 సీట్లు ఉంటాయి. ఇక 20 కోచ్లతో కూడిన వందే భారత్ రైల్లో ప్రయాణికులకు ఎక్కువ స్థలం ఉంటుంది. సీటింగ్ కెపాసిటీని 25 శాతం పెంచారు. అంటే ప్రయాణీకుల సంఖ్య 1,440 మందికి పెరగనుంది.
Also Read: హాట్ బాత్, విమానం తరహా సౌకర్యాలు.. ‘వందే భారత్’ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు
త్వరలో అందుబాటులోకి నాలుగు 20 కోచ్ రైళ్లు
20 కోచ్లతో కూడిన వందే భారత్ రైలును గత నెలలోనే సక్సెస్ ఫుల్ గా ట్రైయల్ రన్ నిర్వహించారు. త్వరలో వందే భారత్ అప్ డేట్ వెర్షన్ అయిన నాలుగు 20 కోచ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో రెండు రైళ్లు, న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య రెండు రైళ్లు నడపనున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఈ రూట్లలో ఇప్పటికే 16 కోచ్ ల వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి.
24 కోచ్ ల వందేభారత్ రైళ్లపై ఫోకస్
త్వరలో 20 కోచ్ ల రైళ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో… రైల్వేశాఖ 24-కోచ్ ల వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత నెలలో, వందే భారత్ రైళ్ల కోసం రైల్వేశాఖ రూ. 35,000 కోట్లతో టెండర్లను పిలిచింది. ఇందులో భాగంగా 24-కోచ్ల కు సంబంధించిన 80 వందే భారత్ రైళ్లను తయారు చేయించబోతోంది.
సెప్టెంబర్ 15 నుంచి కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం
త్వరలో జంషెడ్పూర్ నుంచి 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 15న జరిగే ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్నారు. ఈ రైళ్లలో 8, 16 కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు.