Uttarakhand: ఉత్తరాఖండ్ లో హిమాలయాల అధిరోహించేందుకు వెళ్లిన ఇద్దరు విదేశీ పర్వాతారోహకులు మూడు రోజుల తర్వాత బతుకు జీవిడా అంటూ ప్రాణాలతో బయపడ్డారు. చమోలీ జిల్లాలోని చౌఖంబా III శిఖరాన్ని అధిరోహించేందుకు ఇద్దరు విదేశీ మహిళా పర్వాతారోహకులు బయల్దేరారు. సుమారు 6,015 మీటర్ల ఎత్తులో అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు వారి ఆచూకీ గుర్తించి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఏకంగా 80 గంటల సమయం పట్టినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.
మూడు రోజుల పాటు అరిగోస పడ్డ మహిళా పర్వాతారోహకులు
అమెరికాకు చెందిన మిచెల్ థెరిసా డ్వోరాక్, యుకెకు చెందిన ఫావ్ జేన్ మానర్స్ అక్టోబర్ 3న మౌంటెనీరింగ్ ఫౌండేషన్ సాయంతో చౌఖంబా పర్వతం III శిఖారాన్ని అధిరోహించేందుకు బయల్దేరారు. ఈ పర్వాత శిఖరం 6, 995 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇద్దరూ కలిసి 6,015 మీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లారు. అక్కడ చేరుకున్న కాసేపటికే వారి లాజిస్టికల్ తో పాటు టెక్నికల్ పరికరాలు కింద పడిపోయాయి. ఏ సాయం లేకపోవడంతో ఇద్దరూ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని మౌంటెనీరింగ్ ఫౌండేషన్ డెహ్రాడూన్ లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కు అందించింది.
రెండు ఆర్మీ హెలికాఫ్టర్లతో సెర్చ్ ఆపరేషన్
అటు డెహ్రాడూన్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందించింది. ఇద్దరు పర్వాతారోహకులకు సంబంధించిన వివరాలను అందించింది. వెంటనే మహిళా పర్వాతారోహకుల ఆచూకీ కోసం రెండు IAF హెలికాప్టర్లు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. చమోలిలోని అంగుళం అంగుళాన్ని గాలించాయి. భారత వైమానిక దళానికి తోడుగా SDRF, NDRF, స్థానిక అధికారులు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. సుమారు 80 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఇద్దరు పర్వతారోహకులను చౌఖంబా పర్వతం మీది నుంచి హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేశారు. ఆదివారం ఉదయం వారిద్దరినీ క్షేమంగా బేస్ క్యాంప్ కు తీసుకొచ్చారు.
Chamoli, Uttarakhand: The rescue operation for two climbers, one from the USA and one from the UK, trapped on Mount Chaukhamba concluded successfully after 80 hours. Conducted by the Indian Air Force, SDRF, NDRF, Army, and local administration, the operation began on October 4,… pic.twitter.com/iJxgKUAh0A
— IANS (@ians_india) October 6, 2024
భారత ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపిన విదేశీ పర్వాతారోహకులు
తమను ఎంతో కష్టపడి ప్రాణాలతో కాపాడిని భారత ఎయిర్ ఫోర్స్ కు మిచెల్ థెరిసా, ఫావ్ జేన్ కృతజ్ఞతలు తెలిపారు. “మూడు రోజుల పాటు ఒంటరిగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఒకానొక సమయంలో ప్రాణాల మీద ఆశ వదలిలేసుకున్నాం. చివరకు భారత సైన్యం మమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చింది. మా ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్” అని చెప్పారు. అనంతరం వారిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడం పట్ల భారత సైన్యంతో పాటు ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..