New Parliament Building : పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం ఎవరు చేయాలన్నదానిపై వివాదం మరింత ముదిరింది. రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని 19 విపక్షపార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది.
కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, కేరళ కాంగ్రెస్ (మణి), వీసీకే, ఆర్ఎల్డీ, ఆర్జేడీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎండీఎంకే పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనాలా..? లేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాలా..? అనే దానిపై గురువారం నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు.
పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విపక్షాలు అంటున్నాయి. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుందని మండిపడుతున్నాయి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోదీకి కొత్తేం కాదని విమర్శించాయి. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలను లేవనెత్తినప్పుడు వారిపై అనర్హత వేటు వేశారని ఆరోపించాయి. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో విపక్ష సభ్యులకు ఏ విలువా కనిపించడం లేదని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
మరోవైపు కేంద్రం వెనక్కి తగ్గడంలేదు. తన చర్యను సమర్థించుకుంటోంది. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్కు కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. పార్లమెంట్ అనుబంధ భవనాన్ని 1975 అక్టోబర్ 24న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారని గుర్తు చేశారు. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1987 ఆగస్టు 15న పార్లమెంట్ గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఇప్పుడు మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే తప్పేమిటని కాంగ్రెస్ను ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి రియాక్ట్ అయ్యారు. ఆ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.