Lok Sabha Session to Begin Tomorrow: 18వ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. భర్తృహరి మెహతాజ్ చేత ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించనున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నది.
మొత్తం 543 ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేపించనున్నారు. రెండు రోజులపాటు.. రేపు, ఎల్లుండి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నది. తొలిరోజు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. ఆ తరువాత రోజు అనగా ఎల్లుండి తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
కాగా, జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే, ఏకాభిప్రాయంతో స్పీకర్ ను ఎన్నుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలంటూ విపక్ష కూటమి కోరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: JP Nadda: రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా
నాటి నుంచి కూడా సంప్రదాయంగా ప్రతిపక్షానికి లేదా మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నారు. 2014లో అన్నాడీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ ఇచ్చింది. 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా తంబిదురై ఉన్నారు. 17వ లోక్ సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఉభయ సభలను ఉద్దేశించి జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.
ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇండియా కూటమికి కూడా ఊహించినదాని కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది.. కానీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కు దక్కనున్నది. ప్రతిపక్ష ఎంపీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని వారు ఎప్పటికప్పుడు నిలదీసే అవకాశం లేకపోలేదంటూ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఫ్లాట్ఫామ్ టికెట్స్, బ్యాటరీ కార్లకు ఇకనుంచి నో జీఎస్టీ
ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నీట్ పై విద్యార్థుల తరఫున లోక్ సభలో గళం విప్పుతానంటూ హామీ ఇచ్చారు. ఇకనుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయనేది చూడాలి మరి.