Hindu Refugees from Pakistan Conferred Indian Citizenship: వారంతా పాకిస్థాన్ కు చెందినవారు. శరణార్థులుగా భారత్ కు వచ్చారు. ఇన్నాళ్లూ వారికి భారత్ పౌరసత్వం లేదు. కేంద్రం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏ 2019తో అలాంటి శరణార్థులకు పౌరసత్వం దక్కుతోంది. తాజాగా అహ్మదాబాద్ లో పాక్ నుంచి శరణార్థులుగా వచ్చిన 18 మందికి భారత్ పౌరసత్వం కల్పించారు.
అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేశారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ పాక్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు పౌరసత్వం పత్రాలు అందించారు. 2016, 2018 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ఆయా దేశాల్లోని మైనార్టీలకు భారత్ పౌరసత్వాన్ని కల్పించడానికి అహ్మదాబాద్ , కచ్ , గాంధీనగర్ జిల్లాల కలెక్టర్లకు అధికారం కల్పించారు. ఇలా ఇప్పటివరకు 1,167 మంది భారత్ పౌరసత్వం ఇచ్చారు.
దేశ అభివృద్ధిలో భాగస్వామం కావాలని భారత్ పౌరసత్వం పొందిన వారిని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ కోరారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చి బాధితులకు సులభంగా పౌరసత్వం కల్పించాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పించారని తెలిపారు.
Also Read: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి భారత్ లోకి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం కోసం కేంద్రం చట్టం రూపొందించింది. ఇది పౌరసత్వ సవరణ చట్టం-2019. ఈ చట్టాన్ని కేంద్రం మార్చి 11 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఆయా దేశాల నుంచి భారత్ కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లకు భారత్ పౌరసత్వం దక్కుతుంది.