151 sitting MPs and MLAs face cases of crimes against women in India: ఆడవారి భద్రత కోసం దేశంలో ఎన్ని చట్టాలు చేసినా వారిపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కోల్ కతాలో ట్రైనీ మహిళా వైద్యురాలి అత్యాచారం ఆపై హత్య ఘటన తో యావత్ దేశం అట్టుడుగిపోతోంది 2012 లో నిర్భయ పై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య సంఘటన తర్వాత కట్టుదిట్టమైన దిశా చట్టం అమలుచేస్తున్నా ఇంకా సమాజం తలదించుకునేలా చేస్తున్న సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలలు నిండని పసికందులనుంచి వృద్ధ మహిళలనూ వదలడం లేదు దుర్మార్గులు. వయసుతో సంబంధం లేకుండా విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. తమ పక్కనే ఇలాంటి మృగాలు సంచరిస్తున్న సంగతి ఆడవారు కూడా గమనించలేకపోతున్నారు.
మాయమాటలు చెప్పి..
మాయమాటలు చెప్పి వీరిని అలవోకగా లొంగదీసుకుంటున్నారు మగవాళ్లు. కుటుంబ సభ్యులకూ మినహాయింపు లేదు. వావివరసలు మరచి ఇంటి సభ్యులపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు కొందరు. వీళ్ల అఘాయిత్యాలకు తట్టుకోలేక అనేక మంది నిర్భాగ్యపు యువతులు తమ ప్రాణాలను కూడా బలిపెడుతున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, వారి పోస్టులకు లైకులు కొట్టడం వంటి చర్యలతో పరిచయాలు పెంచేసుకుంటున్నారు. ఎదుటివారు ఎవరో తెలియకుండానే కొందరు అమ్మాయిలు చాటింగులు చేస్తుంటారు. రోడ్డుపై కామ్ గా వెళుతున్నా.కొందరు ఆకతాయిలు మహిళలను వేధిస్తునే ఉంటారు. ఇలాంటి విషయాలను చాలా మంది తల్లిదండ్రులకు సైతం చెప్పరు దానితో నిందితులు రెచ్చిపోతుంటారు. అయితే ఈ తరహా నేరాలు కేవలం వాళ్లే చేస్తారనుకుంటే పొరపాటు ఇలాంటి నేరాలు నేటి ప్రజా ప్రతినిధులు కూడా చేస్తున్నారు.
31 వేల అత్యాచార ఘటనలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2018 నుంచి 2022 సంవత్సరం మధ్యకాలంలో జరిగిన అత్యాచార కేసులకు సంబంధించిన శిక్షల శాతం చాలా తక్కువగానే ఉంది. కేవలం 2022 సంవత్సరంలో ముప్పై ఒక్క వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి.తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఓ సెన్సేషనల్ రిపోర్టును తెలిపింది. అయితే మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు జరిపేవారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. బాధ్యతాయుత పదవులలో ఉండి కూడా కొందరు ప్రజాప్రతినిధులు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు గృహ హింస పేరుతో భార్యలను వేధిస్తున్నారు. కొందరు బాలికలను విక్రయించడం, లైంగిక దాడులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు నివేదికలో తెలిపింది. ఓవరాల్ గా ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో గెలిచిన ప్రజాప్రతినిధులు 151 మంది దాకా మహిళల వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. వీళ్లందరిపై గతంలోనే ఈ తరహా కేసులు ఉన్నాయి.
ప్రజాప్రతినిధులే నిందితులా?
మహిళలకు అండగా ఉంటామని ప్రమాణం చేసే ఈ ప్రజాప్రతినిధులే మహిళల వేధింపుల కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో 25 మంది ప్రజాప్రతినిధులపై ఈ తరహా కేసులు నమోదు కావడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ తర్వాత ఏపీలో 21 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై వేధింపుల కేసులు ఉన్నాయి. ఇక ఒడిశాలో 17 మందిపై కేసులున్నాయి. టోటల్ గా చూస్తే 135 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలపై మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి.