DJ Loud Music Boy Dead| ఇటీవల పండుగలకు, ఇంట్లో శుభకార్యాలకు డిజె మ్యూజిక్ పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. పక్కవారికి ఇబ్బంది కలుగుతున్నా, ఆరోగ్యానికి హానికారమని తెలిసినా పార్టీల్లో, బహిరంగ ప్రదేశాల్లో డిజె మ్యూజిక్ పెడుతున్నారు. ఈ డిజె మ్యూజిక్ నుంచి వెలువడే బిగ్గర శబ్దాలకు ఇటీవల ఒక 13 ఏళ్ల పిల్లాడు మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. భోపాల్ లో ఇటీవల దసరా పండుగ సందర్భంగా దుర్గా మాత ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో డిజె మ్యూజిక్ ఉండడంతో ప్రజలు రోడ్డుపై వచ్చి డాన్సులు చేశారు. ఈ క్రమంలో సమర్ బిల్లోర్ అనే 13 ఏళ్ల పిల్లాడు తన ఇంటి ముందు నుంచి వెళుతున్న ఊరేగింపు శబ్దాలు విని బయటికి వచ్చాడు. ఊరేగింపులో డిజె మ్యూజిక్ శబ్దాలకు ఆకర్షితుడై సమర్ కూడా అక్కడికి వెళ్లి జనాలతో కలిసి డాన్స్ చేశాడు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..
సమర్ ఇంటి నుంచి బయటికి వెళ్లడం చూసిన అతని తల్లి జమునా దేవి వెనుక నుంచి అతడిని వెళ్ల వద్దని వారిస్తున్నా విన కుండా సమర్ వెళ్లాడు. దీంతో జమునా దేవి కూడా అతని వెంట పరుగులు తీసింది. ఊరేగింపులో డిజె మ్యూజిక్ వద్ద సమర్ డాన్సు చేస్తూ.. క్షణాల్లో కుప్పకూలిపోయాడు. అది చూసిన అతని తల్లి జమున దేవి.. కింద పడిపోయిన తన పిల్లాడికి ఏమైందోనని కంగారు పడి.. తన పిల్లాడిని కాపాడమని అందరినీ వేడుకుంది.
కానీ అందరూ డిజె మ్యూజిక్ మత్తుల్లో చిందులు వేయడంలో బిజీగా ఉన్నారు. దీంతో అతి కష్టం మీద ఊరేగింపు కాస్త ముందు వెళ్లాక.. జమునా దేవి.. అపస్మారక స్థితిలో ఉన్న తన కొడుకు సమర్ ని తీసుకొని ఆస్పత్రికి చేరింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమర్ గుండెపోటు కారణంగా చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. సమర్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. దీంతో అతని తల్లిదండ్రులు దు:ఖం వర్ణతాతీం. సమర్ తండ్రి కైలాష్ బల్లోర్.. డిజె మ్యూజిక్ కారణంగానే తన కొడుకు చనిపోయాడని.. డిజె మ్యూజిక్ చాలా బిగ్గరగా ఉండడంతో తన కొడుకు సమర్ తట్టుకోలేక కుప్పకూలిపోయాడని చెప్పాడు. తాను ఇదంతా చూసి డిజె మ్యూజిక్ ఆపాలని ఎంత ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో మీడియాతో అన్నాడు. తన కొడుకు చనిపోయవడంతో ఇక తాను ఎవరికోసం జీవించాలో అర్థం కావడం లేదని ఏడుస్తూ అన్నాడు.
Also Read: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. బిజినెస్ మెన్ ఇంట్లో షాకింగ్ దృశ్యాలు
చట్ట ప్రకారం.. శబ్ద కాలుష్యం కలుగకుండా డిజె లేదా ఇతర సౌండ్ సిస్టమ్ లో 55 డెసిబల్ పరిమితి వరకే సౌండ్ ఉండాలి. పైగా రాత్రి వేళ్లలలో ఈ పరిమితి 45 డెసిబల్స్ కు తగ్గిపోతుంది. సైలెంట్ జోన్స్ లో ఈ పరిమితి పగటి పూట 50 డెసిబల్స్, రాత్రి వేళ 40 డెసిబల్స్ ఉంది. కానీ భోపాల్ లో ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ చేసిన సర్వేలో డిజె మ్యూజిక్ 90 నుంచి 100 డెసిబల్స్ వరకు ఉంది. ఇది చాలా ప్రమాదకరం. దీని వల్ల చెవి నొప్పి, వినికిడి సమస్యలు, బిపి తీవ్రంగా పెరిగిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీగా సౌండ్ ఉండడం వల్ల హార్ట్ బీట్ నియంత్రణ కోల్పోయి.. మనిషి చనిపోయే ప్రమాదముందని కార్డియాలజిస్ట్ కిస్లే శ్రీవాస్తవ్ అన్నారు.
డిజె మ్యూజిక్ పరిమితి స్థాయి మించి ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం వల్లే సామాన్యులు ఇబ్బందిపడతున్నారని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.