Maharashtra : దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మహారాష్ట్రలో ఒకే చోట 13 మంది మృత్యువాతపడ్డారు. నవీ ముంబైలో మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం ఆదివారం జరిగింది. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ కు ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు తరలివచ్చారు.
ఉదయం 8 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈవెంట్ను చూసేందుకు జన కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణ కల్పించేలా టెంట్లు మాత్రం వేయలేదు. మండుటెండలో గంటల కొద్దీ కూర్చువడంతో చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. వడదెబ్బకు గురై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది మహిళలు ఉన్నారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే .. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వడదెబ్బ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.