Maoists Encounter: మహారాష్ట్రలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలిలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు ఆరు గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక ఎస్ఐ, మరో జవాన్ ఈ కాల్పుల్లో గాయపడ్డారు. వారిని హాస్పిటల్ తరలించగా.. ప్రాణాపాయమేమీ లేదని అధికారులు తెలిపారు.
గడ్చిరోలి జిల్లాలోని జార్వండి పోలీసు స్టేషన్ పరిధిలోని ఛింద్బత్తి అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు ఎన్కౌంటర్ జరిగింది. సీ 60 మహారాష్ట్ర పోలీసుల పార్టీకి, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎస్ఐ సతీశ్ పాటిల్ గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలోని థానా బండ్ నుంచి వచ్చిన హెలికాప్టర్ ఆయనను హాస్పిటల్ తరలించింది. ఎడమ భుజానికి బుల్లెట్ గాయమైన సతీశ్ పాటిల్కు చికిత్స అందించారు.
ఆ తర్వాత మావోయిస్టుల కోసం పోలీసులు ఉధృతంగా గాలించారు. ఈ క్రమంలో సాయంత్రం వరకు కాల్పులు జరిగాయి. సుమారు ఆరు గంటలపాటు మధ్యలో విరామం ఇస్తూ కాల్పులు జరిగాయి. కాల్పులు ముగిసిన తర్వాత పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించగా ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ వెల్లించారు. అలాగే ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు, మూడు ఏకే 47లు, రెండు ఇన్సాస్, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్లను పోలీసులు రికవరీ చేసుకున్నారు. తిపాగడ్ దళ బాధ్యుడు డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతదేహాన్ని ఆ 12 డెడ్ బాడీల్లో పోలీసులు గుర్తించారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
Also Read: అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్? ప్రెసిడెంట్ బైడెన్ హింట్!
కాగా, సీ 60 పోలీసు బలగానికి మహారాష్ట్ర ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. ఈ బలగానికి రూ. 51 లక్షల రివార్డును రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ‘కాంకేర్ సమీపంలో ఛత్తీస్గఢ్తో సరిహద్దు పంచుకుంటున్న గడ్చిరోలి జిల్లాలో సీ 60 కమాండోలు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో 12 మంది నక్సలైట్లు మరణించారు. 12 మంది మావోయిస్టుల మృతదేహాలను రికవరీ చేసుకున్నారు. ఒక ఎస్ఐ, మరో జవాన్ గాయపడగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. పరిస్థితులు దాదాపుగా పోలీసు అదుపులోనే ఉన్నాయి. గడ్చిరోలీ పోలీసులకు ప్రభుత్వం తరఫున రూ. 51 లక్షల రివార్డును నేను ప్రకటిస్తున్నాను’ అని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.