If You Eat Curd in Winter:ప్రస్తుత కాలంలో మన ఆహారంలో పెరుగు తప్పనిసరిగా మారింది. కొద్ది మంది మాత్రమే పెరుగును ఇష్టపడరు. కొందరికైతే భోజనం చివరలో కొంచెం పెరుగన్నం లేకపోతే భోజనం చేసినట్టుకూడా ఉండదు. మంచి గడ్డ పెరుగు వేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచితో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. అయితే చలికాలంలో చాలామంది పెరుగును దూరం పెడుతారు. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయాందోళన చెందుతారు. వైద్య నిపుణులు మాత్రం అది ఒట్టి అపోహేనని అంటున్నారు. చలికాలంలో పెరుగు తింటే నష్టం లేదని చెబుతున్నారు. పెరుగు తినడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మన శరీరం అనారోగ్య సమస్యలను చురుగ్గా ఎదుర్కొంటుంది. నిజానికి జలుబు, దగ్గు లాంటి సమస్యలను పెరుగు తగ్గిస్తుంది. చలికాలంలో కొంతమందిని మలబద్దకం వేధిస్తుంది. పెరుగులోని పోషకాలు మలబద్ధకాన్ని పోగొడతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల శరీర కండరాలకు బలం వస్తుంది. ఎముకలు కూడా ధృడంగా మారుతాయి. దంత సమస్యలు కూడా దరిచేరవు. పెరుగును ప్రతిరోజు తినడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు బాగా తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటును కూడా పెరుగు కంట్రోల్ చేస్తుంది. అయితే పెరుగును పగటిపూట మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రి తింటే మ్యూకస్ పేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆస్తమా ఉన్నవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.