Vitamin D Deficiency : ఇప్పుడంతా స్పీడ్ యుగం. ఉరుకుల పరుగుల జీవనం. ఉదయం నిద్రలేచామా.. ఆదరాబాదరాగా టిఫిన్ చేశామా.. పరుగులు తీస్తూ ఆఫీసుకు చేరామా.. ఎండ అనేది ఎరగకుండా ఏసీల్లో పనిచేశామా.. తిరిగి ఇంటికి వచ్చామా.. పొద్దునే లేచేసరికి మళ్లీ యథాతథం. వ్యాయామం చేసేందుకు తీరిక ఎక్కడ? ఒంటికి ఎండపొడ లేకపోవడం వల్లే శారీరక, మానసిక సమస్యలూ చుట్టుముడుతున్నాయి. ఉదయాన్నే సూర్యనమస్కారాలు, నదీస్నానాలు అంటూ పెద్దలు ఊరకనే ఆచారాలు పెట్టలేదు. వీటి వల్ల శరీరానికి తగిన మోతాదులో విటమిన్-డీ లభిస్తుంది.
ఇది లోపించిన కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎండ వేడి తగలని శీతల ప్రాంతాలు సరే.. సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలోనూ విటమిన్-డీ లోపం తీవ్రంగా ఉండటం విస్తుగొల్పుతోంది. ఇందుకు కారణం మన జీవనశైలే. అంతే కాదు.. సన్ అలర్జీ కేసులు కూడా విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో అధికమైనట్టు వైద్యులు చెబుతున్నారు.
95% మంది విటమిన్-డీ లోపంతో బాధపడుతున్నారని అంటున్నారు. దద్దుర్లు, చికాకు, పిగ్మెంటేషన్, పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ కేసులు పెరుగుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆయా సమస్యలతో తమ వద్దకు వస్తున్న రోగులు 20 శాతం వరకు ఉన్నారని బెంగళూరులోని ప్రముఖ వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యం విషయంలో సూర్యరశ్మి పాత్ర కీలకమే అయినా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జరిగే చర్మనష్టంపైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇందులో భాగంగా సన్స్క్రీన్ను తగినంతగా అప్లై చేయాలని సూచిస్తున్నారు. వేసవిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యరశ్మి నేరుగా శరీరంపై పడటాన్ని పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతి ఆరు నెలలకోసారి చర్మ, విటమిన్-డీ లోపానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.