Vegetable pulao: నూనె వాడకుండా పులావ్, బిర్యానీలు చేయలేం అనుకుంటారు. చుక్క నూనె అవసరం లేకుండా రుచికరంగా పులావ్ ను వండుకోవచ్చు. ఇది ఆరోగ్యమైనకరమైన రెసిపీగా చెప్పుకోవాలి. ఊబకాయంతో బాధపడేవారు, డైటింగ్ లో ఉన్నవారు ఇలా ఆయిల్ లేని వెజిటేబుల్ పులావ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని చేయడం చాలా సులువు. అరగంటలో దీన్ని వండేయచ్చు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
వెజిటబుల్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – రెండు కప్పులు
క్యారెట్లు – రెండు
కాలీఫ్లవర్ ముక్కలు – అరకప్పు
బీన్స్ ముక్కలు – అర కప్పు
పాలు – ముప్పావు కప్పు
పసుపు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
లవంగాలు – మూడు
మిరియాలు – ఐదు
బిర్యానీ ఆకులు – రెండు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – నాలుగు
జాజికాయ – చిన్న ముక్క
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు
వెజిటబుల్ పులావ్ రెసిపీ
వెజిటబుల్ పులావ్ కోసం బాస్మతి బియ్యాన్ని ఎంచుకోవాలి. ఈ బియ్యంతో పులావ్ టేస్టీగా వస్తుంది. అరగంట ముందే బాస్మతి బియ్యాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ను స్టవ్ మీద పెట్టి పాలు వేయాలి. పాలను వేడి చేయాలి. ఆ పాలు బాగా మరిగాక అందులో లవంగాలు, జాజికాయ ముక్క, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, మిరియాలు వేసి మరిగించాలి.
తర్వాత క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్ ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి వేయించాలి. జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యాన్ని పాలల్లో వేసి కలుపుకోవాలి. ఆ బియ్యం కడగడానికి సరిపడా నీటిని కూడా వేయాలి.
కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తరుగును పైన చల్లుకొని మూత పెట్టాలి. అంతే టేస్టీ వెజిటబుల్ పులావ్ రెడీ అయినట్టే. దీనిలో మనం ఆయిల్ వాడలేదు.. అయినా సరే ఇది అడుగంటకుండా టేస్టీగా వస్తుంది. పాలల్లో ఉండే వెన్న ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది.
Also Read: ఆంధ్ర స్టైల్లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి
నూనె లేని వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బిర్యానీ, పులావుల్లో అవసరానికి మించి ఆయిల్ని వేసి వండే వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి ఇలా పాలతో బిర్యాని చేసుకొని చూడండి. ఎంత రుచిగా ఉంటుందో. బిర్యానీ, పులావుల్లో పెరుగును వేయడం అందరికీ తెలిసింది. పెరుగుకు బదులు పాలను వేస్తే నూనె వేయాల్సిన అవసరం ఉండదు.