Norway Government: ఈ రోజుల్లో చిన్న పిల్లలు సెల్ ఫోన్ కు బానిసలుగా మారిపోతున్నారు. ఏడాది పిల్లలు సైతం సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకుని వదలట్లేదు. యూట్యూబ్ లో వీడియోలు పెడితేనే ఉగ్గు తింటామని మారాం చేస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలు ఏకంగా ట్విట్టర్, ఫేస్ బుక్ అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల గురించి అవలీలగా చెప్పేస్తున్నారు. ఏబీసీడీలు కూడా సరిగా రాని పిల్లలు యూట్యూబ్ ఓపెన్ చేసి రీల్స్ చూసేస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలు సెల్ ఫోన్ కు బానిసలుగా మారిపోతున్నారు. బోలెడు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నార్వే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
15 ఏండ్లు నిండితేనే సోషల్ మీడియా చూడాలి!
పిల్లలు రోజు రోజుకు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్న నేపథ్యంలో నార్వే ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సోషల్ మీడియా చూడాలంటే కచ్చితంగా 15 ఏండ్ల వయసు దాటి ఉండాలనే నిబంధన తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా ఆదేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ వెల్లడించారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియా చిన్న పిల్లల మెదడును కలుషితం చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించకపోవడం కారణంగా చిన్నారులు భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
నిబంధనలు ఉన్నా.. అమలు అంతంత మాత్రమే!
వాస్తవానికి సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కనీస వయసు 13 ఏండ్లు ఉండాలి. కానీ, వయసు ధృవీకరణ కోసం ప్రత్యేకంగా పరిశీలన అనేది లేదు. చిన్న వయసు పిల్లలు కూడా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేసి సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నార్వే సర్కారు కచ్చితంగా వయో పరిమితిని 15 ఏండ్లకు పెంచాలని భావిస్తోంది. అప్పటి వరకు పిల్లల్లో ఆలోచన శక్తి పెరిగి, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే అవకాశం ఉందంటున్నది.
11 ఏండ్ల పిల్లలు సోషల్ మీడియా చూస్తే ఏమవుతుంది?
10 ఏండ్ల వయసులో ఉన్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం, ముఖ్యంగా సోషల్ మీడియాలకు అలవాటు కావడం వల్ల విపరీత ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్లు ప్రవర్తించే విధానంలోనూ తేడాలు వస్తాయంటున్నారు నిపుణులు. అందుకే 15 ఏండ్లు వచ్చే వరకు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం మంచిదంటున్నారు నార్వే ప్రధాని. పిల్లల మంచి కోసం తల్లిదండ్రులు కాస్త కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. సెల్ ఫోన్ విషయంలో చూసి చూడనట్లు వదిలేయకూడదంటున్నారు.
Read Also:: వామ్మో సెల్ ఫోన్, పిల్లలకు అస్సలు ఇవ్వకండి, లేదంటే ఈ ముప్పు తప్పదు!