Smartphone Effects in Children: నేటి ఆన్లైన్ యుగంలో పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. చిన్న వయస్సులో పిల్లలు ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల వారి ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే 13% కంటే ఎక్కువ మంది పిల్లలు మయోపియాతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మయోపియా అంటే దూరంగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బంది ఏర్పడటం. గత 10ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువయింది. దీనికి ప్రధాన కారణం పిల్లలు స్మార్ట్ ఫోన్లు చూడటమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మయోపియా అనేది ఒక అనారోగ్య సమస్య దీని ద్వారా దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. అయినప్పటికీ సమీపంలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సాధారణంగా బాల్యంలోనే పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
మయోపియా బాల్యంలో అభివృద్ధి చెంది వయస్సుతో పాటు మరింత ఎక్కువ అవుతుంది. తీవ్రమైన మయోపియా వల్ల రెటీనాకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చిన్న వయసులోనే పిల్లలు ఎక్కువగా స్క్రీన్ చూడడం, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడడం వల్ల మయోపియా సమస్య వస్తుంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మయోపియా సమస్య తక్కువగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సులభంగా యాక్సెస్ చేయడమే దీనికి ప్రధాన కారణం.
పరిష్కారం:
పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతుండడం వల్ల ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. అందుకే వారిని ఎక్కువ సమయం బయట ఆడుకునేందుకు ప్రోత్సహించాలి. మయోపియాను నివారించడంలో సూర్యరశ్మి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. అంతే కాకుండా వారిని కంటి పరీక్షలకు కూడా క్రమం తప్పకుండా తీసుకువెళ్లాలి.
Also Read: చెమటలు పడితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
మయోపియా కేసులు:
భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మయోపియా వ్యాధి వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు మయోపియాతో బాధ పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న మయోపియా కేసులు ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారాన్ని పెంచడం ఆందోళన కలిగించే అంశం. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలు ఫోన్లు, డిజిటల్ పరికరాల వినియోగాన్ని నియంత్రించేలా చేయాలి.