Public tasts changed giving preference to Veg better than Non veg
ఒకప్పుడు నాన్ వెజ్ తినాలంటే బాబోయ్ ఎంత రేటో అనుకునేవారు. అప్పట్లో వెజ్ మీల్స్ చాలా చౌకగా లభ్యమయ్యేది..ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ధరల కన్నా వెజ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సగటున చూస్తే గత ఏడాది ఇదే సమయంలో శాఖాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార ధరలు నాలుగు శాతం తగ్గినట్లు తాజాగా క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా క్రిస్ విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ నివేదిక ప్రకారం గత ఏడాది జూన్ లో రూ.26.7 గా ఉన్న ప్లేట్ రోటీ ధర ఇప్పుడు ఏకంగా రూ.29.4 కు పెరిగింది. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, ఆలూ 59 శాతం పెరగడమే ఇందుకు కారణంగా చెబుతోంది.
డిమాండ్ తగ్గిన నాన్ వెజ్
2023లో రూ.60.5 గా ఉన్న ప్లేట్ చికెన్ థాలీ రేటు ఈ సంవత్సరం మరింతగా పడిపోయింది. ప్రస్తుతం రూ.58కే లభ్యమవుతోంది. బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గింది.
ఆహారం విషయంలో పబ్లిక్ అభిరుచులు మారడమే ఇందుకు కారణమంటోంది క్రిసిల్. అంతేకాదు పబ్లిక్ లో పెరగిన ఆరోగ్య అవగాహన కూడా ఇందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.
అభిరుచులు మారుతున్నాయి
కరోనా మహమ్మారి తర్వాత ప్రజల ఆహార అభిరుచులలో బాగా తేడా వచ్చింది. ముఖ్యంగా నాన్ వెజ్ పై ప్రజల అభిప్రాయం మారుతోంది. వెజ్ తోనే ఆరోగ్యం అని భావించడంతో ఇప్పుడు వెజ్ ఫుడ్ అమాంతం రెండింతలై కూర్చొంది. దాంతో మార్కెట్లో వెజ్ మీల్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో 80 రూపాయలు ఉన్న వెజ్ మీల్స్ ఇప్పుడు ఏకంగా 180 నుంచి 200 వరకూ వెళ్లిపోయింది. శాఖాహారంలో పోషకాలు ఎక్కువగా లభ్యమవడంతో ఎక్కువ శాతం వెజ్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ఆ ప్రభావం కూడా వెజ్ మీల్స్ పై పడటంతో రేట్లు తప్పనిసరిగా పెంచాల్సివస్తోంది.